డ్రగ్స్ కేసులో నిన్న అరెస్టయిన బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్తో పాటు ముగ్గురు నిందితులకు ముంబయి సిటీ కోర్టు ఈ నెల 7వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. ఆర్యన్ ఖాన్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. క్రూజ్లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయం వ్యవహారంలో ఆర్యన్ఖాన్ సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరినీ సోమవారం మధ్యాహ్నం సిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆర్యన్ ఖాన్తో పాటు నిందితులను ఈ నెల 11వరకు కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ కోరింది. ఎన్సీబీ తరఫున కోర్టులో ఏఎస్జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించగా.. ఆర్యన్ తరఫున సతీశ్ మనేశిందే వాదించారు. వీరిద్దరి మధ్య వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. డ్రగ్స్ వాడిన వారిని దర్యాప్తు చేయకపోతే ఎవరు సరఫరా చేస్తున్నారో, ఫైనాన్సింగ్ ఎవరు చేస్తున్నారో ఎలా తెలుసుకోగలమని ఎన్సీబీ తరఫు న్యాయవాది అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నందున నిందితులను అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కుట్ర ఛేదించాలంటే నిందితుల కస్టడీ అవసరమని, డ్రగ్స్ వల్ల యువతరం దారుణంగా ప్రభావితమవుతోందంటూ ఆయన వాదించారు. రేవ్ పార్టీ నిర్వాహకులను కూడా విచారించాల్సి ఉందన్నారు. మరోవైపు, ఆర్యన్ఖాన్ తరఫున సతీశ్ మనేశిందే వాదించారు. అధికారులు జరిపిన సోదాల్లో ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదన్నారు. ఆయన వద్ద డ్రగ్స్ దొరకకుండా కస్టడీకి ఎలా కోరతారు? ఇతరుల వద్ద డ్రగ్స్ దొరికితే ఆర్యన్ ఖాన్కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఇది నాన్బెయిలబుల్ కేసే అయినప్పటికీ.. దాన్ని నిర్ధారించే ఆధారాలు, వాస్తవాలు ఉండాలని వాదించారు. వాట్సాప్ చాట్లో నేరపూరితమైన సాక్ష్యాలు, అంతర్జాతీయ డ్రగ్ రాకెట్తో సంబంధాల ఆరోపణలపై మాన్శిందే స్పందిస్తూ.. ఆర్యన్ఖాన్పై తీవ్రమైన అభియోగాలు ఎన్సీబీ మోపుతోందన్నారు. డ్రగ్ సిండికేట్తో లింక్లు ఉన్నట్టు ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ఆర్యన్కు షిప్లో డ్రగ్స్ అమ్మాల్సిన అవసరం లేదని, అతడు కోరుకుంటే ఆ మొత్తం నౌకనే కొనగలడన్నారు. బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Post a Comment
0Comments
3/related/default