వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్ రూపంలో తీసుకోవడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. ఇప్పటి వరకూ కొవిడ్ వ్యాక్సిన్ల కాంబినేషన్పై సరైన డేటా అందుబాటులో లేకపోవడంతో ఇది చాలా రిస్క్తో కూడుకొన్న విషయమని తెలిపారు. ప్రజలే సొంతంగా ఎక్కడ, ఎప్పుడు, ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఆందోళనకర విధానమన్నారు. వాస్తవానికి ఇప్పటికే పలు దేశాధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు తీసుకొన్నారు. ఇటీవలే జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వేర్వేరు టీకా డోసులను తీసుకొని ఆశ్చర్యపరిచారు. తొలి విడతలో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఆమె రెండో దఫా మోడెర్నా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో మెర్కెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇక ఇటలీ ప్రధాని మారియో డ్రాగి(73) కూడా ఏంజెలా మెర్కెల్ బాటలోనే నడిచారు. ఆయన కూడా వేర్వేరు తయారీ సంస్థలకు చెందిన కరోనా టీకాలను వేయించుకున్నారు. మొదటి డోసుగా ఆస్ట్రాజెనెకా తీసుకున్న ఆయన రెండో విడతగా ఫైజర్ టీకాను వేయించుకున్నారు. కొన్ని దేశాల్లో ఈ సమ్మేళన విధానాన్ని అమలు చేశారు కూడా. కెనడా, యూకే, కొన్ని ఐరోపా సమాఖ్య దేశాలు వీటిలో ఉన్నాయి. వీరు ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తర్వాత సమస్యలను తప్పించేందుకు ఈ విధానాన్ని పాటించారు. స్పెయిన్, దక్షిణ కొరియాల్లో కూడా ఇలాగే వాడారు. ఆస్ట్రాజెనెకా టీకాకు కాంబినేషన్లో ఎంఆర్ఎన్ఏఈ టీకాలను ఇచ్చారు. రష్యా కూడా ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్-వి టీకాలను ఈ రకంగా ఇవ్వాలని చూస్తోంది. మన దేశంలో ఉత్తర్ప్రదేశ్లోని ఓ గ్రామంలోని ప్రజలకు వైద్యులు నిర్లక్ష్యంతో రెండు డోసుల్లో వేర్వేరు టీకాలను వేశారు.
రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడాన్ని హెటిరోలోగస్ ఇమ్యూనైజేషన్ అంటారు. రెండు విభిన్న టీకాలు వాడిన సందర్భాల్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా స్పందిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ భాగాలను తీసుకొని చేసే టీకాల్లో ఇటువంటి ప్రభావం కనిపిస్తుంది. రెండు రకాల టెక్నాలజీలతో చేసిన టీకాలను వినియోగించినప్పుడు శరీరం విస్తృత స్థాయిలో వ్యాధినిరోధక శక్తిని సిద్ధం చేస్తుందని భావిస్తున్నారు. ఒక టీకా తీసుకొన్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తితే రెండో డోసు కింద మరో టీకా తీసుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జర్మనీ, యూకే, ఫ్రాన్స్, కెనడాల్లో ఆస్ట్రాజెనెకా టీకాకు రక్తం గడ్డకట్టించే లక్షణాలు ఉన్నాయంటూ యువతకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాంటి వారికి వేరే టీకా ఇచ్చి ఇమ్యూనైజేషన్ పూర్తి చేస్తున్నారు.
ముఖ్యంగా ఎబోలా వంటి వైరస్లను ఎదుర్కోవడానికి ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. ఒకే రకమైన టెక్నాలజీతో చేసిన టీకాలను మాత్రమే వాడారు. భారత్లో రోటా వైరస్ టీకాలను కాంబినేషన్లో వినియోగించడం చూస్తూనే ఉన్నాం. భారత్లో వాడే రోటావైరస్ టీకాలు భిన్నమైనవి కావడంతో ఈ విధంగా వాడుతున్నారు.