తమిళనాడులోని తిరుచ్చెందూరు ఆలయాన్ని తిరుమలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులు, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న వంద ఆలయాలకు సంబంధించి కుంభాభిషేకాలు, జీర్ణోద్ధారణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పళని దండాయుధపాణి స్వామి ఆలయం, సమయపురం మారియమ్మన్, తిరుచ్చెందూరు సుబ్రహ్మణస్వామి ఆలయాలను తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేసే అంశంపై చర్చించారు. ముఖ్యంగా కొండలపై ఉన్న ఆలయాలకు రోప్కార్ సౌకర్యం కల్పించే విషయాన్ని కూడా సమీక్షించారు. అలాగే, వంద ఆలయాలకు చెందిన కోనేరులకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఆలయాల్లో ఖాళీగా ఉన్న 2547 పోస్టులను భర్తీ చేయాలని, మదురై మీనాక్షి అమ్మన్ ఆలయంలోని అన్ని రకాల పనులను, అర్జిత సేవలను కంప్యూట రీకరణ చేయాలన్న అంశంపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు మహేంద్రన్, పీకే శేఖర్బాబుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
