ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, టీకాలు తీసుకోకపోతే జీతాలు పొందలేరని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘నో వ్యాక్సినేషన్.. నో సాలరీ’కి సంబంధించి జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని జిల్లా చీఫ్ డెవలప్మెంట్ అధికారి చర్చిత్ గౌర్ చెప్పారు.
‘ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కొవిడ్ టీకా తీసుకోకపోతే.. సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. మే నెల జీతాన్ని నిలిపివేస్తుంది’ అని గౌర్ వెల్లడించారు. జిల్లా ట్రెజరీ అధికారులకు, ఆయా విభాగాధిపతులకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపినట్లు ఆయన తెలిపారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆయన కోరారు.