అరట్టై యాప్ గత కొన్ని రోజులుగా అధిక ప్రజాదరణ పొందుతోంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు సమాచార గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మెసేజస్ పంపుకోవడానికి, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటివి షేర్ చేసుకోవడానికి, వాయిస్ కాల్స్ & వీడియో కాల్స్ చేసుకోవడానికి అరట్టై ఉపయోగపడుతుంది. ''అరట్టై చాట్ యాప్ని ఉపయోగిస్తున్నప్పుడు భార్యాభర్తలు షేర్ చేసుకునే ఫోటోలు ఎంతవరకు గోప్యంగా ఉంటాయని'' ఒక యూజర్ అడిగారు. దీనిని 'నన్ను నమ్మండి బ్రో' అంటూ జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. యూజర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకునే యాప్ రూపొందించామని, వినియోగదారుల భద్రతకు ఎలాంటి భంగం కలగదని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్' కూడా రాబోతోందని ఆయన అన్నారు. నమ్మకం చాలా విలువైనది. మేము ప్రపంచ మార్కెట్లో ప్రతిరోజూ ఆ నమ్మకాన్ని సంపాదిస్తున్నాము. మా వినియోగదారుల నమ్మకాన్ని మేము నెరవేరుస్తూనే ఉంటామని వెంబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వాట్సాప్ ప్రారంభమైన తరువాత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ 2016 వరకు అందుబాటులో లేదు. అరట్టై కొత్తది కాబట్టి ఇందులో కూడా అలాంటి ఫీచర్ తప్పకుండా వస్తుందని ఒక యూజర్ పేర్కొన్నారు. ఎవరైనా ఒక మంచి చేస్తుంటే బెదిరించడానికి ప్రయత్నించవద్దని ఇంకొకరు అన్నారు. ఏదైనా లోపాలను గుర్తించి మెరుగుపరచడంలో సహాయపడటం మంచిది. ఉద్దేశాలు మంచిగా ఉండాలి, సామాజిక వ్యాఖ్యాతల ఆధారంగా పక్షపాతంతో ఉండకూడదని మరొకరు పేర్కొన్నారు.
యూజర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకునే అరట్టై యాప్ రూపొందించాం !
October 10, 2025
0
Tags