ఢిల్లీ జేఎన్యూలో విద్యార్థి సంఘాల ఎన్నికల ముందు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా విభజన వ్యాఖ్య హింసకు ప్రేరేపించింది. జేఎన్యూ క్యాంపస్లో యూపీ, బీహార్ విద్యార్థులు ఉండటానికి అర్హులు కాదని, వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపించాలని ఒక వర్గం వారు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విభజన వ్యాఖ్య విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర కొట్లాటకు దారి తీసింది. విద్యార్థి సంఘాల నాయకులు కొట్లాటకు దిగడంతో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఏబీవీపీ కారణంగానే క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఏఐఎస్ఏ ఆరోపించింది. విభజన వ్యాఖ్యతో ఏబీవీపీ పోకిరితనం బయటపడిందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణంగా ఘర్షణకు దారి తీసిందని ఆరోపించింది. ఇక ఏబీవీపీ మాత్రం వామపక్ష కౌన్సెలర్ రెచ్చగొట్టడం వల్లే హింస చెలరేగిందని ఆరోపించింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం ఉదయం స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో జరిగిన జనరల్ బాడీ సమావేశం సందర్భంగా ఏఐఎస్ఏ అనుబంధ విద్యార్థులు ఏబీవీపీ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. ఈ ఘర్షణలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. హింసకు జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు, ఏఐఎస్ఏ నాయకుడు నితీష్ కుమారే కారణమని ఏబీవీపీ ఆరోపించింది. జేఎన్యూలో ప్రస్తుతం జనరల్ బాడీ సమావేశాలు జరుగుతున్నాయి. నాలుగు కేంద్ర ప్యానెల్ స్థానాల్లో ఏఐఎస్ఏ మూడు, ఏబీవీపీ ఒకటి కలిగి ఉంది. ఈ క్రమంలో శాంతి, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్నారని ఇరు వర్గాలు తరచుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో జనరల్ బాడీ సమావేశాన్ని ఏబీవీపీ అడ్డుకుని విద్యార్థులను కొట్టారని ఏఐఎస్ఏ ఆరోపించింది.
ఢిల్లీ జేఎన్యూలో ఏఐఎస్ఏ అనుబంధ విద్యార్థులు ఏబీవీపీ విద్యార్థులు ఘర్షణ !
October 16, 2025
0
Tags