కాంగ్రెస్ అగ్రనేత, రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ భద్రతాపరమైన ప్రొటోకాల్ పాటించడం లేదని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆరోపించింది. విదేశీ పర్యటనల వేళ ఆ నియమావళిని ఉల్లంఘించారంటూ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్కు సీఆర్పీఎఫ్ లేఖ రాసింది. ''రాహుల్ గాంధీ తనకు అందిస్తోన్న భద్రతను సీరియస్గా తీసుకోలేదు. ఎక్కువ సందర్భాల్లో ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విదేశాలకు వెళ్తున్నారు'' అని సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ ఆ లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్లో ఇటలీ, మార్చిలో వియత్నాం, ఏప్రిల్లో దుబాయ్, జూన్లో ఖతార్, లండన్, సెప్టెంబర్లో మలేషియా పర్యటనకు రాహుల్ వెళ్లారని ప్రస్తావించారు. సీఆర్పీఎఫ్ ఎల్లో బుక్ నియమావళిని పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ (Congress), ఖర్గే, రాహుల్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందనా రాలేదు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లీజాన్ కలిగిన జెడ్+ సెక్యూరిటీ కవర్ కింద రక్షణ పొందుతున్నారు. తీవ్రముప్పు పొంచి ఉన్న వారికి ప్రభుత్వం ఈ స్థాయి భద్రతను కల్పిస్తుంటుంది. దీనికింద రాహుల్కు 55 మంది రక్షణగా ఉంటారు. వారిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు కూడా ఉంటారు. ఈ ఏఎస్ఎల్ కింద.. భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ యూనిట్లను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తారు. సదరు వీఐపీ పర్యటించే ప్రాంతం వద్ద ముందస్తు నిఘా ఉంచుతారు.
రాహుల్ గాంధీ భద్రతాపరమైన ప్రొటోకాల్ పాటించడం లేదని సీఆర్పీఎఫ్ ఖర్గే, రాహుల్కు లేఖ
September 11, 2025
0
Tags