ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ఏడాది వయసున్న పసికందుతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఉక్రెయిన్ మరోసారి ఉలిక్కిపడింది. ఈరోజు ఖార్కివ్లోని ఓ ఐదంతస్తుల నివాస భవనంపై రష్యా డ్రోన్తో దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి, శిథిలాల కింద చిక్కుకున్న ఓ యువకుడిని, యువతిని సురక్షితంగా బయటకు తీశాయి.ఈ దాడికి కొన్ని గంటల ముందు, అంటే నిన్న సాయంత్రం కూడా ఖార్కివ్పై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. ఆ ఘటనలో 13 ఏళ్ల బాలుడితో సహా ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు, గత శుక్రవారం రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు రష్యా ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ ఖిన్ష్టెయిన్ తెలిపారు. నగరంలోని రైల్వే జిల్లాలో ఉన్న ఓ భవనంపై డ్రోన్ దాడి జరగడంతో పై నాలుగు అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఖార్కివ్ నగరంలో ఐదంతస్తుల నివాస భవనంపై రష్యా డ్రోన్ దాడి
August 18, 2025
0
Tags