ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆర్మీ జవాన్పై టోల్ సిబ్బంది దాడి చేశారు. స్తంభానికి కట్టేసి కనికరం లేకుండా కర్రలతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కపిల్ కవాద్ అనే సైనికుడు భారత సైన్యంలోని రాజ్పుత్ రెజిమెంట్లో పని చేస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చాడు. తిరిగి శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రాయానికి బంధువుతో కలిసి వెళ్తున్నాడు. ఆదివారం రాత్రి మీరట్-కర్నాల్ హైవేలోని భూని టోల్ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కపిల్ కవాద్ కారు దిగి ఎయిర్పోర్టుకు సమయం అవుతుంది. తాను ఆర్మీ జవాన్ను అంటూ టోల్సిబ్బందితో చెప్పాడు. త్వరగా లైన్క్లియర్ చేయాలని కోరాడు. ఈ క్రమంలో టోల్సిబ్బంది-జవాన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అంతే టోల్ బూత్ సిబ్బంది మూకుమ్మడిగా జవాన్పై దాడికి తెగబడ్డారు. స్తంభానికి కట్టేసి కర్రలతో బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు టోల్ప్లాజా సిబ్బందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఘర్షణకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. వీడియోలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ (గ్రామీణ) రాకేష్ కుమార్ మిశ్రా తెలిపారు. కపిల్ కవాద్ భారత సైన్యంలో ఉన్నాడని.. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు శ్రీనగర్ వెళ్తున్నాడని చెప్పారు. తొందరపడి టోల్ బూత్ సిబ్బందితో మాట్లాడడం అనంతరం వాగ్వాదం ప్రారంభమైందని చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సరూర్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. నలుగురిని అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
మీరట్లో జవాన్పై టోల్ సిబ్బంది దాడి
August 18, 2025
0
Tags