15 సెకన్లలో గుండె జబ్బులు గుర్తించే ఏఐ స్టెతస్కోప్ !

Telugu Lo Computer
0


బ్రిటన్ పరిశోధకులు ఏఐ స్టెతస్కోప్ అభివృద్ధి చేశారు. ఇది కేవలం 15 సెకన్లలోనే గుండె జబ్బులను గుర్తించగలదు. హార్ట్ ఫెల్యూర్, హార్ట్ బీట్‌లో అవకతవకలు అలాగే గుండె వ్యాధులను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో గుర్తించగలదని తాజా అధ్యయనంలో తేలింది. సాధారణంగా, వైద్యులు గుండె సంబంధిత సమస్యలను గుర్తించడానికి స్టెతస్కోప్‌ను ఉపయోగిస్తారు. అయితే, మానవ చెవికి వినిపించని హార్ట్‌బీట్‌లో తేడాలను ఈ కొత్త ఏఐ స్టెతస్కోప్ గుర్తించగలదు. ఇది ఒక ఎలక్ట్రోకార్డియోగ్రామ్ రికార్డింగ్‌ను కూడా ఏకకాలంలో తీసుకుంటుంది. ఈ పరికరం రోగి ఛాతీపై ఉంచగానే, గుండె శబ్దాలను, విద్యుత్ సంకేతాలను రికార్డు చేస్తుంది. ఈ సమాచారం వెంటనే క్లౌడ్‌కు పంపబడుతుంది, అక్కడ ట్రైన్ అయిన ఏఐ అల్గారిథమ్‌లు వాటిని విశ్లేషిస్తాయి. కేవలం 15 సెకన్లలో రిజల్ట్స్ డాక్టర్ స్మార్ట్‌ఫోన్‌కు చేరుకుంటుంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ మరియు ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ ఎంహెచ్ఎస్ ట్రస్ట్ పరిశోధకులు దాదాపు 12,000 మంది రోగులపై ఈ పరికరాన్ని పరీక్షించారు. ఊపిరి ఆడకపోవడం, అలసట, కాళ్ల వాపు వంటి గుండె జబ్బుల లక్షణాలు ఉన్న రోగులపై ఈ స్టెతస్కోప్‌తో టెస్టులు నిర్వహించారు. ఈ ఏఐ స్టెతస్కోప్‌తో పరీక్షించిన రోగులకు, సాధారణ పద్ధతుల్లో పరీక్షించిన వారితో పోలిస్తే, హార్ట్ ఫెల్యూర్స్ బయటపడే అవకాశం రెట్టింపు ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే, అసాధారణ హార్ట్ బీట్, గుండెలో రక్త నాళాల వ్యాధులను కూడా సులభంగా గుర్తించబడ్డాయి. ఈ విప్లవాత్మక పరికరం, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటు తక్కువగా ఉన్న చోట, ఈ పరికరం తక్కువ ఖర్చుతో వేగవంతమైన రోగ నిర్ధారణకు సహాయపడుతుంది. భారతదేశంలో కూడా బెంగళూరుకు చెందిన 'ఏఐ హెల్త్ హైవే ఇండియా' అనే స్టార్టప్ 'ఐస్టెత్' పేరుతో ఇలాంటి ఒక డిజిటల్ స్టెతస్కోప్‌ను అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తోంది. ఈ కొత్త సాంకేతికత వైద్యులకు ఎంతో సహాయకారిగా ఉంటుందని, తద్వారా గుండె జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి, రోగులకు సకాలంలో చికిత్స అందించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)