రెండు సెషన్లలో సెన్సెక్స్‌ 1264 పాయింట్లు కోల్పోయిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌తోపాటు ఇతర ఫైనాన్షియల్‌ స్టాక్స్‌, అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు, భారత్‌- అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌పై అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఇందుకు కారణంగా నిలిచాయి. దీంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఈ రెండు సెషన్లలోనే సెన్సెక్స్‌ 1264 పాయింట్లు కోల్పోయింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.9 లక్షల కోట్లు క్షీణించి రూ.451 లక్షల కోట్లకు చేరింది. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో సెన్సెక్స్‌ ఉదయం 82,065.76 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,184.17) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,397.69 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 721.08 పాయింట్ల నష్టంతో 81,463.09 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225.10 పాయింట్ల నష్టంతో 24,837 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.52గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 69.33 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3,348 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)