ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లి పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. ప్రతి చోట బారీకేడ్లు పెట్ట మరి వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కంటేపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అదే మార్గంలో వచ్చిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన వాహనంలో నుంచి దిగి బారీకేడ్లను తొలగించాలని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టేశారు. దీంతో అంబటి రాంబాబు వర్గీయులు, వైసీపీ నేతల తీరుతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు 188,332, 353, 427 సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
June 19, 2025
0
Tags