ఒక టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించిన మొదటి భారత వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌

Telugu Lo Computer
0


లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా  మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మొదటి, రెండో ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించాడు. ఇలా ఒక టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించిన మొదటి భారత వికెట్‌ కీపర్‌గా, ప్రపంచంలో రెండో వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. లీడ్స్‌ టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్ పంత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 75.28 స్ట్రైక్‌రేట్‌తో 134 పరుగులు సాధించాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్స్‌లున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 84.29 స్ట్రైక్‌రేట్‌తో 118 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 3 సిక్స్‌లున్నాయి. ఇలా ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు.. వికెట్‌ కీపర్‌ విభాగంలో పంత్‌కంటే ముందు కేవలం ఆండీ ఫ్లవర్‌ మాత్రమే చేశాడు. ఈ జింబాబ్వే ఆటగాడు 2001లో హరారే వేదికగా దక్షిణాఫ్రికాపై ఆడిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 142 రన్స్‌ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బ్యాటర్లలో సునీల్‌ గవాస్కర్‌ మూడు సార్లు, రాహుల్‌ ద్రవిడ్‌ రెండు సార్లు ఈ ఫీట్‌ సాధించారు. భారత్‌ తరఫున మొట్టమొదట విజయ్‌ హజారే.. 1948లో ఆస్ట్రేలియా మీద ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేశాడు. అలాగే పంత్‌కంటే ముందు దక్షిణాఫ్రికా మీద 2019లో రోహిత్‌ శర్మ, 2015లో అజింక్య రహానే, 2014లో ఆస్ర్టేలియా మీద విరాట్‌ కోహ్లీ ఇలా ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేశారు. మొత్తంగా భారత బ్యాటర్ల జాబితాలో ఏడో వ్యక్తిగా పంత్‌ స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇంగ్లాండ్‌ గడ్డ మీద భారత్‌ తరఫున ఈ రికార్డు సాధించింది ఇప్పటి వరకు ఒక్క రిషభ్‌ పంత్‌ మాత్రమే. 

Post a Comment

0Comments

Post a Comment (0)