శ్రీశైలంలో జూలై ఒకటి నుంచి ఉచిత స్పర్శదర్శనం పునరుద్దరణ

Telugu Lo Computer
0


జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో ఆరు నెలల కిందట ఆగిపోయిన మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని జూలై ఒకటో తేదీ నుంచి పునః ప్రారంభిం చనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన టోకెన్ల జారీ, సమయాల వివరాలను వెల్లడించారు. దీంతో, కొంత కాలంగా భక్తులు వేచి చూస్తున్న ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జునస్వామిని భక్తులు తమ చేతులతో తాకుతూ 'స్పర్శ దర్శనం' చేసుకొనే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో సామాన్యులకు తక్కువ టైమ్​లో మల్లన్న దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ఆరు నెలల కిందట శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు రద్దు చేయడంతో పాటు, మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం వేళల్లో ఉచిత సర్శ దర్శనాన్నీ నిలుపుదల చేస్తూ ఆలయన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, భక్తుల అభ్యర్ధన మేరకు జులై ఒకటో తేదీ నుంచి శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్జిత సేవలకు ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం వేళల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు అమలు చేయనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వివరించారు. అవకాశాన్ని బట్టి రోజూ 1,000 నుంచి 1,200 మందికి ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ ఉచిత సర్ప దర్శనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఉండదని స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి స్థానికంగానే దేవస్థానం వద్ద కౌంటర్‌ ఏర్పాటు చేసి భక్తులకు ప్రత్యేక టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)