చిన్న స్థాయి గోల్డ్ లోన్ గ్రహీతలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన

Telugu Lo Computer
0


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు తాకట్టు రుణాలపై ఇటీవల విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. రూ. 2 లక్షల లోపు బంగారు రుణాలు తీసుకునే చిన్న స్థాయి రుణ గ్రహీతలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ తాజాగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం బంగారాన్ని తాకట్టు పెట్టి ఇచ్చే రుణాల్లో బంగారం విలువలో 75 శాతం కన్నా ఎక్కువ రుణం ఇవ్వరాదని పేర్కొంది. అయితే దీనివల్ల చిన్న రైతులు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న చిన్న రుణ గ్రహీతలు తీవ్రంగా ప్రభావితమవుతారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల విభాగం ఆ ముసాయిదాను సమీక్షించి, చిన్న మొత్తాల బంగారు రుణాలపై ప్రభావం లేకుండా ఉండేలా మార్పులు చేయాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే తుది మార్గదర్శకాల్లో కొన్ని సడలింపులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారు రుణాలపై ఆధారపడే చిన్న రైతులు, చిన్న వ్యాపారుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు సామాన్యుడిపై భారం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం గమనార్హం. ఆర్బీఐ త్వరలో తుది మార్గదర్శకాలను సవరిస్తుందని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)