హైదరాబాద్ లోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఈ విచారణ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ లను ప్రభుత్వం నియమించింది. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం జరిగిన కారణాలు, ఘటన అనంతరం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయడం ఈ కమిటీ బాధ్యత. కారణాలపై నివేదిక తయారు చేయడమే కాకుండా, భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు చేయాలి వంటి విషయాలపై కమిటీ స్పష్టమైన ప్రతిపాదనలు సమర్పించనుంది. ఘటనపై నివేదిక అందిన అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటారని మంత్రి పొన్నం వెల్లడించారు. ప్రజల ప్రాణాలు విలువైనవని, భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలపై సున్నితంగా స్పందించడమే కాకుండా, తక్షణమే పరిష్కార మార్గాలు అన్వేషించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ కమిటీ ఏర్పాటు ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు
May 20, 2025
0
Tags