తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సబ్ కమిటీ ఏర్పాటైనప్పటికీ, ఏడు నెలలు గడిచినా ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని పిలిచారు. కానీ మంత్రులు మాత్రం చర్చకు సమయం కేటాయించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం విజ్ఞప్తులకు స్పందించకపోవడం వాస్తవమే. ఆర్థిక సమస్యలు పక్కన పెట్టినప్పటికీ, విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మేము సమరం కాదు, ఉద్యమం చేస్తున్నాం. మంత్రుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నాం. అడగొద్దు అంటే అడగం. మేమే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చాం అని ఆయన పేర్కొన్నారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే గౌరవం. మీరు తండ్రి పాత్రలో ఉన్నారు. మీరు ఇచ్చిన గంట సమయం మాకు విలువైనది. కానీ, మిగిలిన మంత్రులు మాత్రం మాట్లాడటం లేదు. ప్రజలపై యుద్ధం చేయాలని మేము కోరడం లేదు. సబ్ కమిటీ అనే మీ ఏర్పాటు చేసిన బృందం అసలు మాట్లాడటానికి ముందుకు రావడంలేదు. సీఎం చెప్పినట్లే, కొంతమంది సంఘాల నేతలు ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారు. వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూడండి. ప్రభుత్వానికి డబ్బుల్లేవన్న విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ, మాతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయండి. కోట్ల రూపాయలు అడగడం లేదని ఆయన అన్నారు. మొత్తంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తమ అంచనాలను స్పష్టంగా తెలియజేస్తూ సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
సమరం కాదు, ఉద్యమం చేస్తున్నాం : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు
May 05, 2025
0
Tags