ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన భారత విదేశాంగ శాఖ

Telugu Lo Computer
0


పరేషన్‌ సిందూర్‌ గురించి ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల పాకిస్తాన్ అప్రమత్తం అయ్యిందని కాంగ్రెస్‌ చేస్తున్న వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించిన తొలి దశలో పాక్‌ సహా ఇతర దేశాలకు సమాచారం ఇచ్చామని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌  తెలిపినట్లు పేర్కొంది. కానీ దాడికి ముందే ఈ సమాచారం బయటకు వెళ్లినట్లు కాంగ్రెస్‌ నేతలు అసత్య ఆరోపణలు చేస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం జైశంకర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. భాజపా రాహుల్‌ వ్యాఖ్యలను తప్పుబట్టింది. రాహుల్‌ తమ ప్రభుత్వంపై నిందలు మోపాలనే దురుద్దేశంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై బ్రీఫింగ్‌ ఇస్తూ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ చేసిన ప్రకటనను ఆ పార్టీ ఉటంకించింది. ఆపరేషన్‌ ప్రారంభించిన వెంటనే తాము ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నట్లు పాక్‌కు చెప్పడానికి ప్రయత్నించగా, భవిష్యత్తులో ఆ దాడులకు తాము తీవ్ర సమాధానం ఇస్తామని దాయాది దేశం చెప్పినట్లు లెఫ్టినెంట్ జనరల్ పేర్కొన్నట్లు భాజపా తెలిపింది. జైశంకర్‌ విదేశాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఆయనపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది. పీఐబీ సైతం కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చింది. కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయలేదని తన ఫ్యాక్ట్‌చెక్‌లో పేర్కొంది. రాహుల్‌ గాంధీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై దాడి చేస్తున్నామని, పాక్‌ సైన్యం వాటికి దూరంగా ఉండాలని భారత్‌ చెప్పినట్లు జైశంకర్‌ పేర్కొన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అలా చేయడం వల్ల దాయాది దేశం ముందుగానే అప్రమత్తమయ్యిందని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)