మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా శనివారంనాడు ముంబై పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఆయనపై నమోదైన కేసుల విషయంలో విచారణ అధికారి ముందు హాజరుకావాలంటూ ముంబై పోలీసులు గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేశారు. ఆయన హాజరుకాకపోవడంతో ఏప్రిల్ 5వ తేదీలోగా హాజరుకావలంటూ మూడోసారి కూడా సమన్లు జారీ అయ్యాయి. అయితే ఈసారి కూడా ఆయన విచారణకు దూరంగా ఉన్నారు. కునాల్ కామ్రా గత మార్చి 23న జరిగిన కామెడీ షోలో శివసేన పార్టీలో చీలికను ప్రస్తావిస్తూ ఏక్నాథ్ షిండేను 'ద్రోహి'గా అభివర్ణించారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు షో జరిగిన స్టూడియో, హోటల్పై దాడి చేశారు. కుణాల్ పై శివసేన ఎమ్మెల్యే మూర్జి పటేల్ ఖార్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. ఆ తర్వాత జలగావ్ మేయర్, ఒక హోటల్ యజమాని, ఒక వ్యాపారి సైతం కుణాల్ పై కేసులు నమోదు చేశారు. కాగా, తన కామెడీ షో చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఎలాంటి న్యాయవిచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని కుణాల్ ప్రకటించారు. ఇదే సమయంలో తనకు 500 బెదిరింపు ఫోన్లు వచ్చాయని చెబుతూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ఏప్రిల్ 7వ తేదీ వరకూ కోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. మరోవైపు, కునాల్ తన వీడియాల ద్వారా వివిధ దేశాల నుంచి డబ్బులు అందుకున్నారని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ ముంబై ఆర్థిక నేరాల విభాగానికి శివసేన బుధవారంనాడు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసింది.
ముంబై పోలీసుల విచారణకు కుణాల్ కామ్రా గైర్హాజరు !
April 05, 2025
0
Tags