ఏపీఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్‌పై సస్పెన్షన్‌ వేటు

Telugu Lo Computer
0


బెంగళూరులో పార్కింగ్‌ విషయంలో తలెత్తిన వివాదంలో ఏపీ ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా జరిగిన దాడిపై ఏపీ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఈ దారుణంపై కర్ణాటక అధికారులకు ఫిర్యాదు చేయగా.. అక్కడి ఉన్నతాధికారులు కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్‌పై సస్పెన్షన్‌ వేటు విధించారు. ఏపీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరపాలని బెంగళూరులోని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. కడప జిల్లా ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్‌ తీవ్రంగా దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రొద్దుటూరు డిపోలో పనిచేసే ఎన్‌ఆర్‌ఎస్‌ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా గురువారం బెంగళూరుకు వెళ్లగా పార్కింగ్‌ విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌ఎస్‌ రెడ్డిపై కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్‌ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ కింద పడేసి కాళ్లతో తన్నాడు. బాధతో అతడు ఆర్తనాదాలు చేసినా వదలకుండా చితకబాదాడు. ఈ ఘటనపై ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడ్డాయి. తక్షణమే కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసేలా ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. బెంగళూరులోని ఏపీఎస్‌ఆర్టీసీ ట్రాఫిక్‌ మేనేజర్‌ ద్వారా కర్ణాటక అధికారులకు ఫిర్యాదు చేయించడంతో సదరు ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)