అమరావతిలో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్యూ)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో జీఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్యూ సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంతో 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ జీఎన్యూతో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతోపాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న తమ ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం, గ్లోబల్ ఎక్స్పోజర్, పాఠ్యాంశాలను మెరుగుపర్చడం, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని లోకేశ్ వెల్లడించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెక్నాలజీ, బిజినెస్, హెల్త్ కేర్ రంగాల్లో విద్యార్థులకు జీఎన్యూ నైపుణ్యాలను అందిస్తుందన్నారు.
జీఎన్యూతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం !
March 24, 2025
0
Tags