జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన దారులందరికీ ఒకేరకమైన టోల్ విధానం అమలయ్యేలా 'ఏకరీతి టోల్ విధానం'పై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఇది చెక్ పెట్టనుందని తెలిపారు. రోడ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అధిక టోల్ ఛార్జీలు విధిస్తుండడంపై వాహనదారుల్లో అసంతృప్తి గురించి ప్రస్తావించిన సందర్భంలో ఏకరీతిన టోల్ విధానం గురించి గడ్కరీ మాట్లాడారు. అయితే, దీనికి సంబంధించిన అదనపు వివరాలేవీ పంచుకోలేదు. ప్రస్తుతం మన రోడ్లు అమెరికా రహదారులతో సమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. తొలుత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే టోల్ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. సోషల్మీడియాలో రోడ్లపై వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తామని, సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని గడ్కరీ హెచ్చరించారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై 60 శాతం ట్రాఫిక్కు కార్లే కారణమని పేర్కొన్నారు. కానీ, వాటిద్వారా వస్తున్న ఆదాయం 20-26 శాతం మాత్రమే ఉంటోందని చెప్పారు. దీనికితోడు గత పదేళ్లలో కొత్తగా టోల్ ప్లాజాలు పెరగడంతో పాటు, ఛార్జీలు పెరగడం కూడా ప్రజల్లో అసంతృప్తికి కారణమని వివరించారు. 2023-24లో టోల్ రూపంలో రూ.64,809.86 కోట్లు వసూలైందని కేంద్రమంత్రి తెలిపారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 35 శాతం మేర పెరిగిందని చెప్పారు. 2020-21లో సగటున రోజకు 37 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది ఈ రికార్డును అధిగమిస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు.
ఏకరీతి టోల్ విధానంపై కేంద్రం కసరత్తు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
February 03, 2025
0
Tags