ఆధునికీకరణ పనుల్లో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ కూల్చివేత !

Telugu Lo Computer
0


ధునికీకరణ పనుల్లో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవనాలు నేలమట్ట మయ్యాయి. 1952లో కట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1916వరకు నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వే(ఎన్‌జీఎ్‌సఆర్‌)కు ఇదే ప్రధాన స్టేషన్‌గా ఉండేది. 1951లో ఎన్‌జీఎ్‌సఆర్‌ను జాతీయం చేయడంతో ఇండియన్‌ రైల్వే్‌సలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ భాగమైంది. 1952లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీని పోర్టికో నిజాం ఆర్కిటెక్చర్‌కు అనుగుణంగా కోటను పోలి ఉంటుంది. మరో ఏడాదిలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎయిర్‌పోర్టును తలపించేలా మారనుంది. రూ.720 కోట్లతో చేపట్టిన స్టేషన్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించేలా అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. ఉత్తరం, దక్షిణం వైపున జి+3 అంతస్తులతో ఐకానిక్‌ స్టేషన్‌ భవనాలను నిర్మిస్తున్నారు. వాటిలో రిటైల్‌ దుకాణాలు, ఆహార శాలలు, వినోద సౌకర్యాలు ఉండనున్నాయి. స్టేషన్‌కు ఇరువైలా రెండు ట్రావెలేటర్లతో పాటు రెండు నడక మార్గాలు, ప్రయాణికులు స్టేషన్‌లోకి వచ్చేందుకు 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన రెండు ఫుట్‌ బ్రిడ్జిలు, ఒక స్కైవేను నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రోస్టేషన్‌ను స్కైవేతో అనుసంధానం చేయనున్నారు. ఉత్తరం వైపు నడకమార్గం, 5వేల కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణం వైపు బేస్‌మెంట్‌, సివిల్‌ స్ట్రక్చరల్‌, ప్లంబింగ్‌ వంటి పనులు దాదాపు 85శాతం పూర్తయ్యాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రయాణికుల పికప్‌, డ్రాప్‌ జోన్‌ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు ఇతర సివిల్‌ పనులు తుదిదశకు చేరాయి. ఉత్తరం వైపు గణేశ్‌ ఆలయ సమీపంలో 400 కార్లను నిలిపేలా మల్టీలెవల్‌ పార్కింగ్‌ పనులు చేస్తున్నారు. స్టేషన్‌ భవనంలో యుటిలిటీ షిఫ్టింగ్‌ 50శాతం పూర్తయింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ కార్యాలయ సమీపంలో 1.50 లక్షల లీటర్ల అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంకు, రైలు లైటింగ్‌ ఏరియా సమీపంలో మరో 2లక్షల లీటర్ల వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం పూర్తయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)