తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత కార్యాలయం ముందు బైఠాయించి కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాగా, కంచెల రామకృష్ణరెడ్డి భువనగరిలో శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి చేశారంటూ మండిపడింది. రేవంత్ చేతగాని పాలనపై విమర్శలను తట్టుకోలేకనే దాడి చేశారంటూ ధ్వజమెత్తింది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం అనంతరం ఒక్కసారిగా గుంపులుగా వచ్చి కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారంటూ కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై సైతం దాడికి యత్నించారని, పాలన చేతగాక, మీ అసమర్థతపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా? అంటూ నిలదీసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నది. యదా రాజ తథా ప్రజా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నరు అని హరీశ్ రావు మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీకు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా? బీఆర్ఎస్ పార్టీపైన గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడి నెలకొన్నదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతమవుతే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన రీతిలో బుద్ధి చెబుతం అని హరీశ్ రావు హెచ్చరించారు.
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి : హరీశ్ రావు వార్నింగ్
January 11, 2025
0
Tags