ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ ఇవాళ కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి అతిషి సోమవారం నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. కానీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. దాంతో ఇవాళ ఉదయాన్నే ఆమె నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్ అతిషి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని భావించిన అతిషి ఉదయం కల్కాజీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాతో కలిసి కల్కాజీలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా అప్పటికే సమయం మించిపోయింది. దాంతో ఆమె నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. ఇవాళ ఉదయాన్నే వెళ్లి నామినేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ నామినేషన్ దాఖలు
January 14, 2025
0
Tags