ప్రతి సంవత్సరం రేషన్షాపుల్లో ప్రభుత్వం ఇచ్చే పొంగల్ కిరాణా సరకులతోపాటు నగదును పంపిణీ చేయాలా? వద్దా? అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. పొంగల్ కిరాణా సరకులతోపాటు రూ.2 వేల నగదును పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్షాపుల్లో ఇచ్చే పచ్చిబియ్యం, చక్కెర, చెరకుగడతోపాటు రూ.2 వేలను కూడా పంపిణీ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని కోరుతూ బీజేపీ న్యాయవాది ఎ.మోహన్దాస్ పిటిషన్ను దాఖలు చేశారు. సంక్రాంతి పండుగకు ముందు దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించాలంటూ న్యాయమూర్తులు ఎస్ఎం సుబ్రమణియం, వి.లక్ష్మీనారాయణన్తో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని న్యాయమూర్తులు తోసిపుచ్చారు. పొంగల్ సరకులతోపాటు నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం నగదును పంపిణీ చేస్తే తమకు సంతోషమేనని, అయితే నదును పంపిణీ చేయాలంటూ తామెలాంటి ఉత్తర్వు జారీ చేయలేమని స్పష్టం చేశారు. పొంగల్ సరకులతోపాటు నగదును అందించాలా? వద్దా? అనే విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్ విజ్ఞప్తిని తోసిపుచ్చారు.
పొంగల్ సరకులతోపాటు నగదు అందించాలా? వద్దా? అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం : మద్రాసు హైకోర్టు !
January 18, 2025
0
Tags