గౌరవంగా జీవితాన్ని వెల్లదీసేందుకు నెలకు రూ.7,500 కనీస పెన్షన్ ఇవ్వాలని ఈపీఎస్-95 పెన్షనర్ల ప్రతినిధి బృందం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేసింది. రూ.7,500 పెన్షన్తో పాటు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) డిమాండ్ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్-95 లేదా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే ఉంది. తాజా భేటీపై ఈపీఎస్-95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించనున్నట్లు ఆర్థికమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసిన 78 లక్షలకు పైగా పెన్షనర్ల పరిస్థితిని ఆర్థికమంత్రికి వివరించినట్లు ఈపీఎస్-95 నేషనల్ అగిటేషన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రౌత్ తెలిపారు. నెలకు రూ.1,000 పెన్షన్ను రూ.7,500కు పెంచాలని, డీఏతో పాటు పె న్షనర్, వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య చికిత్సను అందించాలని పెన్షనర్లు గత 7-8 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని కమాండర్ అశోక్ రౌత్ ప్రస్తావించారు. 'ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెన్షనర్ల డిమాండ్లను పూర్తి మానవతా దృక్పథంతో పరిగణిస్తామని చెప్పారు. ఈ హామీ మాకు ఆశ కలిగిస్తోంది. కానీ ప్రభుత్వం సంకల్పపూర్వకంగా స్పందించి రాబోయే బడ్జె ట్లో కనీసం రూ.7,500 పెన్షన్ను డీఏతో ప్రకటించాలి' అని ఆయన అన్నారు.
కనీస పెన్షన్ రూ.7,500 ఇవ్వాలని ఆర్థికమంత్రిని కలిసిన ఈపీఎస్-95 ప్రతినిధి బృందం
January 12, 2025
0
Tags