రాజస్థాన్ లోని కోట్పుత్లిలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపు గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పోటీ చేస్తున్న తొలి ఎన్నికలు ఇవని, బీజేపీ గెలిస్తే మాత్రం దేశం తగులబడుతుందని బెదిరిస్తోందని ఎద్దేవా చేశారు. దేశమంతా ఒకే కుటుంబ భావనతో బీజేపీతో ఉందని, కాంగ్రెస్ మాత్రం దేశం కంటే తమ కుటుంబమే పెద్దదిని భావిస్తోందని అన్నారు. దేశ కీర్తిని పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు విదేశాలకు వెళ్లినా దేశ ప్రతిష్ఠను దిగజారుస్తూ వస్తోందని మండిపడ్డారు. మోడీ పుట్టింది ఎంజాయ్ చేయడానికి కాదని, కష్టించి పనిచేయడానికని తెలిపారు. గత పదేళ్లలో ఎంతో చేశామని, అది కూడా ఒక ట్రయిలర్ మాత్రమేనని అన్నారు. స్వాతంత్ర్యానంతరం 60 ఏళ్ల పాటు దేశం పేదరికంలో మగ్గడానికి కాంగ్రెస్సే కారణమని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ కారణంగానే సాంకేతికత, రక్షణ సామాగ్రి కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడాల్సి వచ్చిందన్నారు. మన సాయుధ బలగాలను ఎన్నడూ ఆత్మనిర్భర్గా మార్చలేదని, కాంగ్రెస్ పాలనలో ఆయుధాల దిగుమతిలో అతి పెద్ద దిగుమతిదారుగా భారత్ నిలిచిందని చెప్పారు. అందుకు భిన్నంగా ఇప్పుడు బీజేపీ హయాంలో ఆయుధాల ఎగుమతిదారుగా భారత్ నిలిచిందన్నారు.
దేశం పేదరికంలో మగ్గడానికి కాంగ్రెస్సే కారణం !
April 02, 2024
0
Tags