హత్య చేసిన వాళ్లకే కడప ఎంపీ టికెట్‌ ఇచ్చారు !

Telugu Lo Computer
0


వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే కడప ఎంపీ టికెట్‌ ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు. ''కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం అంత సులువైంది కాదని తెలుసు. నేను పోటీలో ఉంటే మా కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నా. గత ఎన్నికల ముందు షర్మిల నా చెల్లెలు కాదు.. నా బిడ్డ అని జగన్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా విస్మరించారు. నా అనుకున్న వాళ్లను జగన్‌ నాశనం చేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు. మా చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను జగన్‌ వెనకేసుకొస్తున్నారు. హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్‌ వారిని కాపాడుతున్నారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి జగన్‌ వైకాపా టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేక పోయా. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైకాపా రాజకీయ కోసం వాడుకుంది. హత్య చేయించిన వారికి టికెట్‌ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా అతనికే టికెట్‌ ఇచ్చారు. వివేకా చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయాలి. ఆయన కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నా. సునీత కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతోంది. హంతకుడైన అవినాష్‌రెడ్డిని చట్ట సభలో అడుగుపెట్టకుండా చేయడమే నా లక్ష్యం. కడపలో అతను గెలవకూడదు అంటే నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని కోరారు. షర్మిల రాజకీయ ప్రవేశ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆమె తల్లి విజయమ్మ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కన్నీటితో ప్రార్థన చేశారు. తమ కుటుంబానికి వచ్చిన ఈ పరీక్షలో నెగ్గేలా చేయమని ప్రార్థించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)