ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగిన తమిళ సంగం 2.0 కార్యక్రమంలో భాషిణి ఏఐ టూల్ను వినియోగించారు. కేంద్ర ప్రభుత్వమే భాషిణి ఐఏ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భారత ప్రజలు అందిస్తున్న డేటాతోనే ఆ టూల్ను క్రియేట్ చేశారు. దేశంలో ఉన్న వివిధ భాషలకు చెందిన తర్జుమాలను ఆ టూల్ ద్వారా వినే సౌకర్యం ఉంటుంది. కాశీ-తమిళ సంఘం సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ తమిళం మాట్లాడే వారు తమ ఇయర్ఫోన్లను పెట్టుకోవాలని కోరారు. భాషిణి ఏఐ టూల్ ద్వారా తన ప్రసంగానికి చెందిన తర్జుమాను వినే అవకాశం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు చెప్పారు. ఇదో కొత్త ఆరంభం అని, నేను మిమ్మల్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రధాని తన ప్రసంగంలో అన్నారు. ప్రధాని మోడీ భాషిణి టూల్ గురించి వివరించిన అంశంపై కేంద్ర మంత్రి సీతారామన్ ట్వీట్ చేశారు. పీఎంవో తీసుకున్న నిర్ణయం ఉత్తేజకరంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్కు చెందిన డిజిటల్ ఉత్పతి భాషిణి అని అమె అన్నారు. రియల్ టైంలోనే ప్రధాని ప్రసంగం తర్జుమా కావడం అద్భుతమని ఆమె తెలిపారు. భాషిణి యాప్ ద్వారా దేశ ప్రజలు తమకు కావాల్సిన భాషలో తర్జుమాలను పొందే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ యాప్లో ప్రత్యేకంగా భాషాదాన్ సెక్షన్ ఉంది. దీంట్లో ఎవరైనా క్రౌడ్సోర్సింగ్ చేసే వీలు ఉంది. ఓపెన్ఏఐ, చాట్జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటి చాట్బాట్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఫ్రెంచ్, స్పానిష్ భాషల తర్జుమాలోనూ ఆ యాప్స్ దాదాపు కచ్చితంగా ఉంటాయి. పశ్చిమేతర భాషలకు మాత్రం ఇంకా ట్రాన్స్లేషన్ యాప్స్ ఎక్కువగా అందుబాటులో లేవు. భారతీయ భాషల్లో ఒక భాష నుంచి మరో భాషకు ట్రాన్స్లేట్ చేసే యాప్స్ కూడా తక్కువే అందుబాటులో ఉన్నాయి. మ్యాజిక్ స్టూడియో యాప్ ద్వార ఇంగ్లీష్ నుంచి హిందీ, బెంగాలీ, తమిళం లాంటి భారతీయ భాషలకు మాత్రమే ట్రాన్స్లేషన్ చేయవచ్చు.
భాషిణి ఏఐ టెక్నాలజీ వాడిన ప్రధాని మోడీ !
December 18, 2023
0
Tags