విస్తృత సంప్రదింపుల తర్వాతే స్టీల్‌ ప్లాంట్‌పై ముందుకు !

Telugu Lo Computer
0


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై విస్తృత స్థాయి సంప్రదింపుల అనంతరమే ముందుకు వెళ్లనున్నట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది. వ్యూహాత్మక విక్రయానికి భాగస్వామ్యపక్షాలతో చర్చించిన అనంతరమే ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను నూరు శాతం విక్రయానికి 2021 జనవరిలోనే కేబినెట్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని గుర్తు చేశారు. ''విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీకి ఒక రూపు తెచ్చేందుకు విస్తృత స్థాయిలో సంప్రదింపులు అవసరం. ఈ లావాదేవీలో భూములు, ఇతర ఆస్తులు కూడా విక్రయించనున్నాం. వివిధ భాగస్వామ్యపక్షాలతో చర్చల అనంతరం ఆసక్తి వ్యక్తీకరణలు ఆహ్వానిస్తాం'' అని కరాడ్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు, యూనియన్ల వల్లే ఆలస్యం అవుతోందా? అనే ప్రశ్నకూ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా, ఎయిరిండియా అనుబంధ ఏఐ అసెట్‌ హోల్డింగ్‌ విక్రయానికి కేబినెట్‌ ఆమోదం లభించినప్పటికీ.. ఈ మూడింటి విషయంలోనూ ఈఓఐ ఆహ్వానించలేదని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)