ఢిల్లీలోని చాందినీ చౌక్కు చెందిన 32 ఏళ్ల సురభి గుప్తా అలియాస్ పాయల్ అలియాస్ సాక్షి డేటింగ్ యాప్ 'బంబుల్' ద్వారా పరిచయమైన వ్యక్తులను దోచుకుంటున్నది. అక్టోబర్ 1న ఈ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తికి సురభి ఫోన్ చేసింది. గురుగ్రామ్లోని ఒక బార్ సమీపంలో అతడ్ని కలిసింది. మద్యం కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అతడు తాగిన మద్యంలో మత్తు మందు కలిపింది. అపస్మారకంగా పడి ఉన్న అతడి నుంచి గోల్డ్ చైన్, ఐఫోన్, పది వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డ్లు దోచుకుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి రూ. 1.78 లక్షలు విత్డ్రా చేసింది. కాగా, అక్టోబర్ 3న మత్తు నుంచి బయటపడిన ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ మహిళపై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు సురభిని ఆమె ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ఒక బంగారు గొలుసు, 15 డెబిట్, క్రెడిట్ కార్డులు, రూ.1.60 లక్షల నగదు, రెండు ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక వాచ్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితురాలైన సురభి గుప్తాను పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఏడు రోజులపాటు ప్రశ్నించారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుమారు పది మంది వ్యక్తుల నుంచి రూ.30 లక్షల మేర దోచుకున్నట్లు ఆమె ద్వారా తెలుసుకున్నారు. ఆ మహిళకు సహకరించిన విశాల్, సుశీల్ను అరెస్ట్ చేశారు.ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన నిందితురాలు ప్రస్తుతం లండన్ వర్సిటీలో ఎంబీఏ కోర్సు చేస్తున్నదని పోలీసులు తెలిపారు. పలు ఎంఎన్సీ కంపెనీల్లో పని చేసిన ఆమె అనంతరం ఒక ముఠాను ఏర్పాటు చేసిందని చెప్పారు. డేటింగ్ యాప్ ద్వారా పలువురితో పరిచయం పెంచుకుని వారిని దోచుకున్నదని వెల్లడించారు.
డేటింగ్ యాప్తో లక్షల్లో దోచుకున్న యువతి
October 20, 2023
0
Tags