అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమయ్యారు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ "రాజస్థాన్ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని సరిగ్గా నడపడంలో విఫలమయ్యారు. అశోక్ గెహ్లాట్ తన సీఎం కుర్చీని కాపాడుకున్నారు. కానీ సగం మంది కాంగ్రెస్ నాయకులు ఆయనను పదవి నుంచి దింపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు" అని ఆరోపించారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేసిందని ప్రధాని విమర్శించారు. రాజస్థాన్‌లో మహిళలపై పెరుగుతున్న నేరాలు చూసి తాను బాధపడ్డానని, దీనిని కాంగ్రెస్ సంప్రదాయంగా మార్చిందని చెప్పారు. ''రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసింది. నేరాల జాబితాలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటం నాకు బాధ కలిగించింది. మహిళలపై నేరాలకు సంబంధించిన అత్యధిక కేసులు రాజస్థాన్‌లోనే నమోదయ్యాయి. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని బహిరంగంగా అంగీకరించినందుకు గెహ్లాట్‌జీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏ ప్రజా పథకాలు ఆపివేయబడవని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇది మరింత మెరుగుపడుతుంది. ఇది మోదీజీ ఇస్తున్న హామీ" అని మోదీ తెలిపారు. బీజేపీకి ఓటేస్తే పేపర్‌ లీక్‌ మాఫియాను కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. పేపర్‌ లీక్‌ వ్యవహారంపై రాజస్థాన్‌ యువతకు తాను హామీ ఇస్తున్నానని, వారిని బాధ్యులను చేసి అవినీతికి పాల్పడి పేదల సొమ్మును దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాజస్థాన్‌కు గత వారసత్వం, వర్తమాన బలం, భవిష్యత్తు అవకాశాలు ఉన్నాయని అన్నారు. దానిని 'త్రిశక్తి' గా వర్ణించారు. రాజస్థాన్‌కు ఉన్న 'త్రిశక్తి' దేశ బలాన్ని పెంచుతుందని ఆయన చెప్పారు. కాగా ఈ ఏడాది చివరలో 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)