దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 'పీఎం ఈ-బస్ సేవ' పథకంలో భాగంగా తొలుత 3వేల బస్సుల్ని సేకరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వచ్చే వారంలోనే టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ మీడియాకు వెల్లడించారు. PM eBus Sewa పథకం కింద పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో 169 నగరాల్లో 10వేల బస్సులను అందుబాటులోకి తేవాలని ఆగస్టులో కేంద్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన మనోజ్ జోషీ.. ఇందులో రాష్ట్రాలు సైతం భాగస్వాములుగా ఉంటాయని తెలిపారు. మరోవైపు, ఆగస్టులో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపేందుకు నెల గడువు ఇచ్చామని.. యూపీ ప్రభుత్వం నుంచి 2వేల బస్సులకు ప్రతిపాదన వచ్చిందని మనోజ్ జోషీ మీడియాకు చెప్పారు. ఇతర రాష్ట్రాలు తమ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో బస్సుల్ని కొనుగోలు చేస్తున్నందున ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ బస్సుల్లో జీపీఎస్తో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అనుసంధానమై కదలికలు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు ఈ పథకం పరిధిలోకి రానున్నాయి. ఆయా చోట్ల వచ్చే పదేళ్లపాటు ఈ-బస్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ-బస్ల సేకరణకు కేంద్రం కసరత్తు !
October 27, 2023
0
Tags