ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా తెలిపారు. సచివాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తి స్థాయి జాబితా ప్రకటించే క్రమంలో భాగంగా ఎన్నికల సంఘం కొత్త ఓటర్లను చేర్చుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒక నియోజకవర్గం నుంచి మరోచోటకు బదిలీ వంటి ప్రక్రియ చేపట్టింది. దీనికి సంబంధించి ముసాయిదా జాబితాను మీనా విడుదల చేశారు. 'ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ ముసాయిదా అందుబాటులో ఉంచాం. డిసెంబరు 9 వరకు ఎవరైనా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. డిసెంబరు 26 లోగా వాటిని పరిష్కరిస్తాం. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5న ప్రకటిస్తాం' అని తెలిపారు. భెల్ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వచ్చాయి. వాటి పనితీరుపై తొలిదశలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలిస్తాం. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలు కొన్ని అభ్యంతరాలు తెలిపాయి. మొత్తం 6 అంశాల ఆధారంగా పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. సుమారు 10 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి తొలగించాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ ?
October 28, 2023
0
Tags