భారత మూలాలు కలిగిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర అద్భుత ఫామ్లో ఉన్నాడు. తాజాగా వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపైనా శతకం సాధించాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ చేతిలో కివీస్ త్రుటిలో ఓడినా, రచిన్ ఆటతీరు మాత్రం ఆకట్టుకుంది. సచిన్, రాహుల్ ద్రవిడ్ ఆటతీరు లక్షణాలను అందిపుచ్చుకుని మరీ చెలరేగుతున్నాడు. ఈ వరల్డ్ కప్లో రెండు శతకాలు చేసి జోరుమీదున్నాడు. ఆసీస్తో మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో రచిన్ మాట్లాడాడు. భారత మూలాలు కలిగి కివీస్ తరఫున భారీ టోర్నీలో ఆడేటప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి కావడం సహజమేనని వ్యాఖ్యానించాడు. అయితే, కీలక ఇన్నింగ్స్లు ఆడటం మరింత గర్వకారణంగానూ ఉందన్నాడు. ''భారత్లో ఆడేటప్పుడు ఒత్తిడి గురించి ఇప్పటికే చాలాసార్లు నన్ను అడిగారు. నేను కూడా సమాధానం ఇచ్చా. మరోసారి చెబుతున్నా నేను వందశాతం కివీస్ ఆటగాడినే. అయితే, నా భారతీయ వారసత్వం పట్ల గర్వంగానూ ఉంది. నా తల్లిదండ్రులు పుట్టి పెరిగిన దేశం. కుటుంబ సభ్యులూ ఉన్న భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం మరింత ఆనందంగా ఉంది. ఇక ఆట విషయానికొస్తే.. భారత్లో పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి. గతంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు గొప్ప ప్రదర్శన చేయలేదు. కానీ, ఎంతో మెరుగుపడేందుకు తీవ్రంగా ప్రయత్నించా. ఇప్పుడది ఈ టోర్నీలో సాయపడుతోంది. ధర్మశాలలో అభిమానుల మద్దతు అద్భుతంగా ఉంది. భారత్లో ఎక్కడ ఆడినా ఫ్యాన్స్ ఉత్సాహపరుస్తున్న తీరు బాగుంది. మైదానంలో అభిమానుల అరుపులు, సందడి ఎప్పుడూ బాగుంటుంది. క్రికెట్ ఆడే వారికి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఒకటుంటుంది. స్టేడియంలో మన పేరును ఫ్యాన్స్ హోరెత్తిస్తుంటూ కలిగే అనుభూతిని ఆస్వాదించడం అద్భుతం. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడైనా.. చివర్లో నీషమ్ ఆడుతున్నప్పుడూ అభిమానులు చేసిన సందడి ముచ్చటేసింది'' అని రచిన్ రవీంద్ర వెల్లడించాడు.
భారతీయ వారసత్వం పట్ల ఎప్పటికీ గర్వపడుతుంటా !
October 29, 2023
0
Tags