తెలంగాణలో 32 చోట్ల జనసేన పోటీ !

Telugu Lo Computer
0


త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమైంది. రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ పేర్కొంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నద్ధతతో ఉన్నామని.. ఈసారి పోటీలో ఉంటున్నట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండొచ్చన్నారు. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, ఖానాపూర్‌, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిర. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్‌ కల్యాణ్‌ జనసేనను స్థాపించారని,  ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేసినట్టు మహేందర్‌ రెడ్డి చెప్పారు. దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో తమ ఓటింగ్‌ ఉందని.. గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నికే ఇందుకు ఉదాహరణ అన్నారు. సింగిల్‌గా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. గత పదేళ్లలో అనేక సమస్యలపై తెలంగాణ జనసేన పోరాటం చేసిందన్నారు. నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్‌ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీ వర్గాలతో పాటు విద్యార్థుల సమస్యలు ఇలా.. అనేక అంశాలపై తాము పోరాటం చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)