వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన పలు విభాగాల అధికారులు ఢిల్లీ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 'రెడ్లైట్ ఆన్.. గాడీ ఆఫ్' క్యాంపెయిన్ను అక్టోబర్ 26 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. అంటే రోడ్డుపై రెడ్ సిగ్నల్ పడగానే వాహనచోదకులు తమ వాహనాలను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ద్విచక్రవాహనాలే అధిక కాలుష్యానికి కారణమవుతున్నాయని, అందువల్ల ద్విచక్రవాహనదారులంతా తమ వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ అప్డేట్ చేయించుకోవాలని మంత్రి సూచించారు. మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని, అలాగే, బస్సులకు సైతం ఇదేరకమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం 13 కాలుష్య హాట్స్పాట్లు ఉండగా, ఈరోజు షాదిపూర్, మందిర్మార్గ్, ప్రతాప్గంజ్, సోనియా విహార్, మోతి బాగ్తో పాటు మొత్తం ఎనిమిది పాయింట్లలో స్థానిక కారణాల వల్ల AQI స్థాయిలు 300 కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. స్థానిక కాలుష్య మూలాలను గుర్తించి తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఆయా చోట్ల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
26 నుంచి ఢిల్లీలో 'రెడ్లైట్ ఆన్-గాడీ ఆఫ్' క్యాంపెయిన్ !
October 23, 2023
0
Tags