పంజాబ్ లోని ముక్త్సర్లో ప్రమాదవశాత్తు ప్రైవేటు బస్సు కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 నుంచి 65 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఝాబెల్వాలి శివారులోని సిర్హింద్ కాల్వలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ముక్త్సర్ నుంచి కొట్కాపురా వైపు వెళ్తోంది. అయితే, ప్రమాద సమయంలో అతివేగంతో వెళ్తున్నట్లు పలువురు తెలిపారు. కాల్వ ఒడ్డున ఏర్పాటు చేసిన ఐరన్ గ్రిల్ విరిగి ఢీకొట్టిన బస్సు ఆ తర్వాత కాలువలో పడిపోయింది. ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటన బాధాకరమని, ప్రస్తుతం సంఘటనా స్థలంలోనే అధికారులు ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.
ప్రమాదవశాత్తు కాల్వ పడ్డ బస్సు : ఎనిమిది మృతి
September 19, 2023
0
Tags