ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18వ తేదీన పాత భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో కొనసాగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక సమావేశాల అజెండాను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలియజేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రధాని మోడీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ లేఖ కూడా రాశారు. తొమ్మిది కీలక అంశాలపై చర్చకు సమయం కేటాయించాలని ప్రధానిని కోరారు. మరోవైపు జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక బిల్లు, ఇండియా పేరు మార్పు వంటి కీలక బిల్లులను కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు !
September 06, 2023
0
Tags