వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతోందని, అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించారని విమర్శించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించడానికే రాజమహేంద్రవరం వచ్చినట్లు చెప్పారు. ''చంద్రబాబుతో గతంలో విభేదించి సెపరేటుగా పోటీ చేశా. రాజకీయాల్లో జనసేన తరఫున నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలని, దేశ సమగ్రత బలంగా ఉండాలనుకున్నా. జనసేన ఏర్పాటు చేసినప్పుడు కూడా అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగిందని చెప్పాను. సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. ఆరోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి ఇబ్బందిగా మారాయి'' అని అన్నారు. జగన్ మద్దతుదారులకు ఇంకా ఆరు నెలలే సమయం ఉందని, వాళ్లు యుద్ధం కోరుకుంటే, వాళ్లకు యుద్ధమే ఇస్తామని అన్నారు. ఎవరినీ వదిలిపెట్టబోమని, ఇసుక దోపిడీ, మైనింగ్, బెల్ట్ షాపులు నిర్వహించిన వారందరినీ బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనసేన-తెదేపా కలిసి పోటీ చేస్తాయని, భాజపా కూడా ఈ నిర్ణయానికి కలిసి వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. జగన్ గురించి ప్రధానికి తెలియని విషయాలేవీ లేవని అన్నారు.
తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయి !
September 14, 2023
0
Tags