భారత్గా పేరు మార్చటాన్ని వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చని పశ్చిమ బెంగాల్ భాజపా నేత దిలీప్ ఘోష్ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 'పశ్చిమ బెంగాల్లో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే కలకత్తాలో వలస వాదానికి ప్రతీకగా నిలిచిన విదేశీ విగ్రహాలన్నింటినీ తొలగిస్తాం. భారత్ పేరు నచ్చని వారు దేశం వదిలి వెళ్లిపోవచ్చు' అని అన్నారు. ఇదే అంశంపై భాజపా మరో నాయకుడు రాహుల్ సిన్హా స్పందిస్తూ 'దేశానికి రెండు పేర్లు ఉండవు. ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరుగుతోంది. పేరు మార్చడానికి ఇదే సరైన సమయం' అని అన్నారు. జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వాన పత్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటూ 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ట్యాగ్ చేశారు. ఇది వెంటనే సోషల్మీడియాలో వైరల్ అయింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. ఎప్పటి నుంచో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న 'ఇండియా' పేరును కాదని భారత్గా పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించాయి. ఈ విమర్శలను అధికార భాజపా తిప్పికొట్టింది. పురాణాల నుంచి భారత్ అనే పేరుందని, రాజ్యాంగంలోనూ భారత్ అనే పేరు ఉందని స్పష్టం చేసింది.
పేరు మార్పును వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చు !
September 10, 2023
0
Tags