అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందుకు జీ20 వేదికను అవకాశంగా మార్చుకోవాలని భారత్ కోరుకుంటోందని చైనా పేర్కొంది. పేరు కంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలని చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్' తాజా కథనంలో వెల్లడించింది. ''స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను భారత్ సంస్కరణల మార్గంలో నడిపించగలదా అన్నదే ముఖ్య విషయం. విప్లవాత్మక సంస్కరణలు లేకుండా, భారత్ విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదు. అయితే, భారత్కు పెరుగుతున్న అంతర్జాతీయ దృష్టిని సద్వినియోగం చేసుకొని, అభివృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని కాంక్షిస్తున్నాం. ఇలాంటి సమయంలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రపంచానికి ఢిల్లీ ఏం చెప్పాలనుకుంటోంది..? కేవలం వలసవాదంగా భావిస్తున్న పేరును తొలగించే ప్రయత్నంగా కనిపిస్తోంది' అని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 'ఆర్థిక సంస్కరణల విషయంలో 1991 నుంచి చూస్తే ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఎంతో కీలకమని భావిస్తున్నప్పటికీ.. దురదృష్టవశాత్తు భారత్ మాత్రం వాణిజ్య రక్షణవాదంవైపు భారత్ వేగంగా అడుగులు వేస్తుండటం గమనార్హం. దేశం పేరు మార్చాలా? వద్దా? అనే విషయం కంటే ఇవన్నీ ఎంతో ముఖ్యమైన అంశాలు' అని చైనా మీడియా పేర్కొంది. ఇక ఇటీవల చైనా కంపెనీలపై భారత్ ఆంక్షలు విధించడాన్ని ప్రస్తావిస్తూ భారత్ తన అసంతృప్తిని అంతర్జాతీయ మార్కెట్లకు బహిరంగంగా తెలియజేస్తోందని పేర్కొంది. జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఆర్థిక సంస్కరణలపై దృఢ సంకల్పాన్ని తెలియజేసేందుకు ఈ వేదికను వాడుకోవాలని చైనా సూచించింది.
పేరు కంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలి : చైనా
September 07, 2023
0
Tags