గురుదక్షిణ ఇవ్వండి !

Telugu Lo Computer
0


విపక్షాల ఆందోళనలతో వాడీవేడీ పరిస్థితులు నెలకొంటున్న రాజ్యసభలో అప్పుడప్పుడు సరదా సంభాషణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ సింగ్‌ హుడాను గురుదక్షిణ అడిగారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాకు పుట్టినరోజు కానుక కొనివ్వాలని సూచించారు. ఆగస్టు 5వ తేదీన ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా పుట్టినరోజు జరుపుకోనున్నారు. శనివారం రాజ్యసభ సమావేశం లేకపోవడంతో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ.. ''మయో కాలేజీలో కాంగ్రెస్‌ ఎంపీ హుడాకు గార్డియన్‌గా ఉండటం గర్వంగా ఉంది. అందువల్ల ఇప్పుడు గురుదక్షిణ అడుగుతున్నా. ఈ సాయంత్రంలోగా నా తరఫున హుడా తన డబ్బుతో మనోజ్‌ ఝాకు పుట్టినరోజు కానుక కొని ఇవ్వాలి. ఇది జరిగేలా సుశీల్‌ కుమార్‌ గుప్తా (ఆప్‌ ఎంపీ) దగ్గరుండి చూసుకోవాలి'' అని అనడంతో సభ్యులంతా నవ్వులు చిందించారు. రాజస్థాన్‌లోని మయో కాలేజీలో హుడాకు దన్‌ఖడ్‌ గార్డియన్‌గా ఉన్నారు. ఆ తర్వాత వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ, కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హికి కూడా ఛైర్మన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మణిపుర్‌ అంశంపై ప్రతిపక్ష సభ్యులతో కలిసి మోపిదేవి నినాదాలు చేస్తుండగా ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. ''మన సభ్యుల పుట్టినరోజులకు కూడా మనం శుభాకాంక్షలు తెలపకపోతే ఇక సభను సజావుగా ఎలా నడపగలం?'' అని అన్నారు. దీంతో సభ్యులంతా నినాదాలు ఆపి ముగ్గురు ఎంపీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)