తాను కూడా ఈ ఈవెంట్ కోసం ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ పురోగతిని కొనియాడుతూ చంద్రయాన్- 3 ప్రయత్నాన్ని ఒక గొప్ప అడుగుగా అభివర్ణించారు. చంద్రుడిపై పరిశోధనలు కేవలం విజ్ఞానానికే పరిమితం కాదని, భూమికి ఆవల స్థిరమైన నివాస అవకాశాలనూ అన్వేషిస్తాయని ఓ టీవీ ఛానెల్తో అన్నారు. 'చంద్రుడిపై ల్యాండింగ్.. మనకెంతో అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతరిక్ష పరిశోధనలు, జాబిల్లిపై స్థిర నివాసం అన్వేషణల విషయంలో భారత్ ముందంజలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవి నిజంగా ఉత్తేజకర క్షణాలు. చందమామపై ల్యాండర్, రోవర్ శాస్త్రీయ పరిశోధనల ఫలితాల విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా, చంద్రుడిపై అన్వేషణలకు సంబంధించి ఇదొక గొప్ప అడుగు కానుంది' అని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. 'చంద్రయాన్- 3' పరిశోధనల సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ.. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్థిరమైన మానవ నివాసాలను స్థాపించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలో వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్ ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే.
ఆసక్తిగా ఎదురుచూస్తున్నా !
August 22, 2023
0
Tags