ముంబయి శివారులోని గోరేగావ్ ప్రాంతంలో గల చింతామణి క్లాసిక్ కాంప్లెక్స్లో ఓ మ్యూజిక్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ సీఈవో రాజ్ కుమార్ సింగ్కు మరో మ్యూజిక్ కంపెనీ యజమాని మనోజ్ మిశ్రాతో కొంతకాలంగా ఆర్థిక వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక శివసేన (శిండే వర్గం) ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే అండతో రాజ్ కుమార్ సింగ్పై మనోజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం రాజ్కుమార్కు తన ప్రత్యర్థులు ఫోన్ చేసిన ఎమ్మెల్యే సుర్వే ఆఫీసుకు రావాలని బెదిరించారు. అయితే, ఇప్పుడు తనకు కుదరదని, శనివారం వస్తానని రాజ్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 10-12 మంది వ్యక్తులు రాజ్ ఆఫీసులోకి చొరబడి అతడిపై దాడి చేశారు. తుపాకీతో బెదిరించి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రాజ్ ఆఫీసులో పనిచేసే సిబ్బంది ఒకరు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు కారు నంబరు ఆధారంగా ట్రాకింగ్ చేపట్టారు. నిందితుల కార్లను గుర్తించి వాటిని వెంబడించి రాజ్కుమార్ను రక్షించారు. అయితే, అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. దీంతో బాధితుడి నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. తనను కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లినట్లు రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. అక్కడ ఎమ్మెల్యే కుమారుడు రాజ్ సుర్వే తనను బెదిరించి కొన్ని స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. మనోజ్ మిశ్రాకు చెందిన ఆదిశక్తి ఫిల్మ్స్కు రాజ్ కుమార్ రూ.8కోట్లు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇలా ఎమ్మెల్యే కుమారుడితో కలిసి తనను అపహరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే కుమారుడు రాజ్ సుర్వే, మనోజ్ మిశ్రాతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
పట్టపగలే కంపెనీ సీఈవో 'కిడ్నాప్' !
August 10, 2023
0
Tags