ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే వివాదాస్పదమైన 'ఢిల్లీ సర్వీసుల బిల్లు' ఆమోదం పొందింది. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఢిల్లీ సర్వీసుల చట్టం (ఢిల్లీ సర్వీసెస్ యాక్ట్)గా అమల్లోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో ఐఏఎస్లతో సహా, ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై ఎన్నికైన ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పు వచ్చిన మరుసటిరోజే అధికారుల బదిలీలు కేంద్రం నియంత్రణలో ఉండేలా మోడీ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్పై ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినా.. వ్యతిరేకంగా ఓటు వేయమని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షనేతల్ని కోరారు. వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో ఢిల్లీ సర్వీసుల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' వ్యతిరేకించింది. సభల్లో ప్రతిపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఢిల్లీ సర్వీసుల బిల్లుతోపాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్ విశ్వాస్ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇవి కూడా చట్టంగా మారాయి.
ఢిల్లీ సర్వీసుల బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం
August 12, 2023
0
Tags