మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్పై తమిళిసై సౌందరరాజన్కు లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఆధారాలు ఇవ్వాలని అడుగుతున్నారని అన్నారు. ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని తెలిపారు. తన వద్ద రూ. 2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు. ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65- బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చానని, కవిత నుంచి రూ. 15 కోట్లు తీసుకొని కేజ్రీవాల్ తరపు వారికి ఇచ్చానని పేర్కొన్నారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
మరోవైపు సుఖేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. నేరస్థుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయన్నారు. సుఖేష్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని, వాడెవడో కూడా నాకు తెలియదని అన్నారు. సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. సుకేష్ లాంటి మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon