లక్నో సివిల్ కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ జీవా కాల్చివేత !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు, మరో మైనర్ బాలిక గాయపడ్డారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు ఈ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జీవాను ఓ క్రిమినల్ కేసులో కోర్టులో హాజరు పరచేందుకు తీసుకువచ్చిన సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు పరారయ్యారు. దీంతో కోర్టు ఆవరణలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను సివిల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి గ్యాంగ్‌స్టార్ జీవా సన్నిహితుడని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్ ద్వివేది హత్య కేసులో జీవా నిందితుడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. 2021లో జీవా భార్య పాయల్ తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందంటూ భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. పాయల్ 2017లో ఆర్ఎల్‌డీ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, లక్నో సివిల్ కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖండించారు. యూపీలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించాయని అన్నారు. ఇదెలాంటి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఎవరిని ఎవరు చంపారనేది దాని కన్నా భద్రత అధికంగా ఉంటే చోటే హత్యలు జరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)