తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాల్లాపూర్లో ఓ యువతిని కత్తితో పొడిచి హత్య చేశారు దుండగులు. అంతేగాక, యువతి కళ్లను స్క్రూ డ్రైవర్తో పొడిచినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పో లీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శిరీష (19).. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. అయతే, గ్రామ శివారులోని ఓ నీటికుంట దగ్గర యువతి దుస్తులు, రక్తపు మరకలు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కుంట నుంచి యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. అనతంరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది.శిరిషను దుండగలు హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలిక కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసిన దుండగులు.. అత్యంత పాశవికంగా కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. ఘటనా స్థలాన్ని పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శిరీష ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్లింది? ఎవరినైనా కలిసేందుకు వెళ్లిందా? ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిరీష మృతితో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
June 11, 2023
0
Tags